Monday, October 21, 2013

జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013


సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న నా మేనల్లుడు  ఆదిత్య ఒక మాట అన్నాడు . నాకు ఎవరివైనా జీవిత చరిత్రలే చదవాలనిపిస్తుంది అత్తా , ఈ కల్పితాలు కాల్పనిక  రచనలు నేను చదవను . జీవిత చరిత్రలు చదవడం లో స్ఫూర్తిని పొందుతాము ఎన్నో విషయాలు  తెలుసుకుంటాము , పైగా అవి నిజంగా జీవించిన వారి గురించి కనుక ఆసక్తిని కలుగ చేస్తాయి అని . పాతికేళ్లు కూడా లేని పిల్లాడు , ఈ రోజుల్లోని అబ్బాయి ,అలా అనడం ఆశ్చర్యమనిపించింది నాకు . ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది . అలాంటి ఒక మనమెరిగిన మనిషి ,  లోకం ఎరుగని చరిత్ర  గురించి ఈ సారి కాసేపు మాటాడుకుందాం .
అవేక్ ! అరైస్ ! స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్” మేలుకో! లే! గమ్యం చేరేవరకు ఆగకు ! ఈ సందేశం ఎవరిచ్చారో జగమంతా , ఈనాటికీ  మాటలు వింటే ఎంత ప్రభావితమౌతామో మీ అందరికీ చెప్పక్కర్లేదు . మనందరికీ తెలిసిన ఆ స్వామి వివేకానందుడు , అతి చిన్న వయసులోనే అంటే 39 వ ఏటనే ఎందుకు మరణించాడు ? ఆ చిన్న వయసులోనే దాదాపు 30 వ్యాధులకు పైగా గురై అన్నది ఆశ్చర్యంగా లేదూ. 
సన్యాసం శూన్యం నాదీ అనుకుంటూ అతి చిన్న వయసులోనే రామ కృష్ణుని శిష్యరికం చేసిన నరేంద్రుడు ఆ పై వివేకాభివృద్ధి చెంది వివేకానందుడై , కేవలం భారత దేశాన్నే కాక , విదేశాలలోనూ మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పిన విశ్వ కుటుంబీకుడు వివేకానందుడు . వివేకానందుడి 150 జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణం లో యోగిగా , నిష్టా గరిష్టునిగా , నిర్మలమైన దరహాసం తో మనకి దర్శన  మిచ్చే స్వామి, చేతులు కట్టుకుని విప్పారిత జ్ఞాన నేత్రాలతో చూస్తోన్న కాషాయం లో ఉన్న ఒక స్ఫూర్తిని పెంపొందించే మూర్తి మన కనుల ముందు కదలాడుతుంది వివేకానందుని తలచుకోగానే . కానీ మిత్రులారా దీపం  కింది చీకటిలా వివేకానందుడు అతి చిన్న జీవితం లోనే ఎన్నెన్ని అనుభవాలు , కష్టాల కావిళ్లెత్త వలసి వచ్చిందో తెలుసుకుంటే  గుండె  చెరువై పోతుంది . నిజం అతని అంతర్గత జీవనాన్ని , కేవలం , ఒక యోగి గా కాక ఒక మనిషిగా  అతని జీవనాన్ని పరిశీలించి రాసిన ఒక పుస్తకం చదవడం తటస్థించింది. ఆ పుస్తకం " ద మంక్ ఏస్ మేన్ , ద అన్నోన్ లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద" , ఈ పుస్తకం రచయిత "శంకర్ " మణి శంకర్ ముఖర్జి అనబడే  ఈ రచయిత బెంగాలీ లో చాలా విస్తృతంగా  చదవబడుతున్న నవలాకారుడు. ఇతను రాసిన నవలలు "సీమ బద్ధ ", "జన అరణ్య " ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే వెండి తెర చిత్రాలుగా మలచాడు . 
నవలలే కాక వివేకానందుని పై శంకర్ పరిశోధనాత్మక రచనలు వ్యాసాలు చాలా పేరు తెచ్చాయి. అతి చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకుని , బ్రిటిష్ పాలన లో గుమాస్తా ఉద్యోగం లో చేరాడు శంకర్. అతని హెడ్ మాస్టర్ అతనికి పదకొండవ సంవత్సరం లోనే వివేకానందుని సాహిత్యం పై మక్కువ కలిగించారు. నీవు సత్యమైనది  చదువు ఎప్పటికీ దారి తప్పవు అంటూ భరోసా ఇచ్చారు. ఇక అప్పటినుండీ మొదలైన సాహితీ సృజన , పరిశోధనాత్మక రచనా రెండూ ఇప్పటికీ అపలేదు శంకర్. ఈయన ఇప్పుడు కొల్కోత లో ఉంటున్నారు . ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక పుస్తకాన్ని ముఖ్యంగా చరిత్రని కానీ ఒక జీవితాన్ని గూర్చి గానీ రాసేవారిని బట్టీ ఆ పుస్తకం పట్ల ఆ వివరాల పట్ల మనకు గౌరవం నమ్మకం కలుగుతాయి కదా అందుకు. వివేకానందుని  జీవితం గురించి శంకర్ చాలా రాసినప్పటికీ ఇంకా అతను మరణించి 110  వత్సరాలు దాటుతున్నా ఇంకా అతని జీవితం లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని భావించారు , అందుకే దాదాపు 200 పుస్తకాలకు పైగా వివేకానందుని గురించి వచ్చినవి కాక , తన పరిశోధనతో , వివేచనతో , జరిగిన  విషయాలను కూలంకషంగా పరిశీలించి రాసిన పుస్తకం ఇది . ఇందులో వివేకానందుడు మనకు దర్శన మిచ్చేది ఒక యోగి గా మాత్రమే కాదు ఒక మామూలు మానవునిగా ఎన్నెన్ని కష్టాలు బాధలు శారీరిక మానసిక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నాడో చదివితే హృది చెమరించక మానదు ఎవరికైనా . 
ఇంతగా కదిలించిన ఈ సత్యా లను మీతో పంచుకుందాం అన్నదే నా చిరు ప్రయత్నం.
తన కన్నా తన బిడ్డలు ముందరే వెళ్ళి పోవడం ఏ తల్లీ సహించలేని బాధ . వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి భరించింది . తన ముందరే ఒక కూతురు , ఇద్దరు కొడుకుల మరణాన్ని చూసి నిస్సహాయంగా జీవించింది . అంతకన్నా ఆశ్చర్యం ఆమె తల్లికి ఈమె ఒక్కతే కూతురు కావడం వలన ఈమెతోనే చివరి వరకూ ఉండి , భువనేశ్వరి దేవి మరణించిన రెండవ రోజు ఆమె మరణించడం విచిత్రం కానీ ఇది నిజంగా జరిగిన సత్యం .
"నా పుత్రుడు 24 ఏళ్లకే  సన్యాసం స్వీకరించాడు  " అని మెరుస్తున్న కనులతో ఆమె చెప్పిన వైనం ఇప్పటికీ చరిత్ర లో ఉంది . ఆమె తో వివేకానందునికి ఉన్న అనుబంధం జీవితాంతం వివేకానందుని  వేధిస్తూనే ఉంది . తన తల్లి కోసం ఏమీ చెయ్య లేక పోయాననే ఒక ఆవేదన ఎల్లప్పుడూ వివేకానందుడి మనసులో  ఉంది  .  తల్లికి పెద్ద కొడుకు కాదు వివేకానందుడు ఎందుకంటే ఆమెకు తొలి కాన్పు కొడుకు చిన్న వయసులోనే చని పోయాడు . నరేంద్రుడు అప్పటినుండీ ఇంటికి తానే పెద్ద కొడుకు గా అన్ని బాధ్యతలనూ స్వీకరించాడు . ఎంతో గొప్ప ఇంటిలో పుట్టిన వాడైనా , తండ్రిని చిన్న వయసులో కోల్పోవడం, ఆ పైనా తన సన్యాస స్వీకరణ , మిగిలిన తమ్ములు , అక్క  చెల్లెళ్ళు  అందరి బాధ్యత ల నుండి బయట పడటం చాలా కష్టమైన పని. అది కేవలం తల్లి ఆశీర్వాదం తోనే చెయ్యగలిగాను అన్న అతని భావన అతని మాతృ భక్తికి నిదర్శనం . 
వివేకానందుడు  సన్యాస జీవితానికి , కుటుంబ బాధ్యతలకి నడుమ ఉన్న నిరంతర సందిగ్దం , విడిచి పెట్టి సంపూర్ణంగా రామకృష్ణుని మఠానికి తన జీవితాన్ని అంకితం చేయడం లోనే స్వామి వివేకానందుని  గొప్పతనమంతా ఉంది. అయితే ఎంత యోగి అయినా సన్యాసి అయినా మానవుడు మానవుడే కదా , సహజమైన మాతృ ప్రేమ ను కాదన  గలిగే వాడు కాదు కదా . అందుకే వివేకానందుని తల్లితో అనుబంధం శంకరాచార్యుని తో పోల్చ బడింది . శంకరాచార్యులు అంతటి యోగి అయినప్పటికి అతని కి తల్లి పై ఉన్న ప్రేమ అపార మయినది . ఒక సన్యాసి పితృ కర్మ చేయకూడదని తెలిసినా తల్లికి మాటిచ్చినట్టు గా ఆమె మరణించిన తర్వాత ఆమె అంత్య క్రియలు చేసేడు శంకరుడు. కానీ వివేకానందుడికి ఆ అదృష్టమూ లేదు , అతని తల్లికి ఆ ప్రాప్తమూ లేదు . 
చాలా మందికి తెలియదు వివేకానందునికి తొమ్మిది మంది అన్నదమ్ములూ  అక్కచెల్లెళ్లూ ఉన్నారని . భువనేశ్వరి కి ఐదవ కానుపు లో  కలిగిన ఆడపిల్ల అరెళ్ళుకే చనిపోయింది. మరొక అమ్మాయి తన అత్తవారింటిలో ఉరేసుకుని తన పద్దెనిమిదవ  ఏట చనిపోయింది. మహేంద్రనాథ్ , భూపేంద్రనాథ్ వివేకానందుని తమ్ములు. చాలా మటుకు అతని జీవిత విశేషాలు  వారికి రాసిన ఉత్తరాల వలన లోకానికి తెలిసింది . వివేకానందుని జీవితం లో జరిగిన అతని అక్కల చెల్లెళ్ల మరణాలు ఎక్కడా అతని జీవిత చరిత్ర రాసిన వారు నమోదు చేయలేదు . 
స్వామి వివేకానందుని గా మన ఎంతో ఆరాధించే ఈ నరేంద్రుడు నిజానికి ఒక  ఆకతాయి అమ్మ కూచి. అమ్మమ్మ దగ్గరా, అమ్మ దగ్గరా ఎంతో గారంగా ఉండేవాడు. తండ్రిని హఠాత్తుగా పోగొట్టుకున్న వారి సంసారం ఒక్క సారి వీధిన పడింది. నెలకు వెయ్యి రూపాయల ఖర్చుతో ఇల్లు నడిపే తల్లి ముప్పై రూపాయలతో నడపడానికి ఎంతో శ్రమించేది . 
ఒకోసారి పొద్దున్న లేవగానే తినడానికి ఏమీ ఉండేది కాదు , అది గమనించి తల్లి బాధ పడుతుందని ఎవరో తనకు భోజనం చెప్పారని ఇంటినుండి బయటపడేవాడుట వివేకానందుడు. కటిక ఉపవాసాలూ , సరి అయిన భోజనం లేక అతి చిన్న వయసులోనే రోగ నిరోధక శక్తి ని కోల్పోయి ఎన్నో వ్యాధులకు గురయ్యింది అతని దేహం. అయినా మొక్కవోని పట్టుదల , తీవ్రమైన దీక్షా వ్రతుడు కావడం వలన తను సాధించవలసిన పనులన్నీ సాధించి ఆ పైనే మరణించాడు . పోయే ముందు కూడా అందరి అప్పులూ తీర్చి వేసానని , మఠం కోసం వచ్చిన  నిధులనుండి కనీసం ఒక పైసా కూడా తీసుకోకుండా , తన ప్రసంగాలవలన వచ్చిన సొమ్ముతో కొంత తమ్ముడిని  ఇంగ్లండ్ పంపి చదివించాడు. తల్లికి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కొనివ్వగలిగాడు.  
తన తండ్రి బ్రతికున్న రోజుల్లో సంపాదన లో కొంత మొత్తం తన మేనమామ కిచ్చి తన భార్య భువనేశ్వరి దేవి పేర ఆస్తి కొనమంటే . ఆయన  కొన్న ఇల్లు , ఆస్తీ అన్నీ ఆయన పోయాక , మేన మామ పోయాక , మేనత్త  ఆ ఆస్తి ఇల్లు తనవేనని కోర్టులో దావా వెయ్యడం  ఆ వ్యాజ్యం ఎన్నో ఏళ్ళు సాగడం తో ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడ్డారు వివేకానందుని కుటుంబం. ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత సతమత మై పోతున్నా , అనారోగ్యంగా  ఉన్నాఇటు మఠం పనులు అటు సంసార బాధ్యతనూ కావిడి కుండల్లా చివరి వరకూ మోస్తూనే ఉన్నాడు వివేకానందుడు. 
చివరికి భువనేశ్వరి దేవి ఇల్లు ఆమె అన్నయ్య తన బావగారిచ్చిన సొమ్ముతోనే కొన్నట్టు రుజువవడం తో తల్లికి ఇల్లు దక్కింది. ఇంత బాధా వీరిని పెట్టిన మేనత్త చివరి  రోజుల్లో మళ్ళీ వివేకానందుడి వద్దనే ఉంది . ఎటువంటి ద్వేషమూ లేని యోగి కనుక ఆమె యోగ క్షేమాన్ని కూడా చూశాడు వివేకానందుడు. 
వివేకానందుడి జీవితం లో కొన్ని సంఘటనలు మనల్ని కలచి వేస్తాయి. ఒక సారి తాను ఇంటికి వచ్చేటప్పటికి తల్లి అమ్మమ్మ భోజనం చేస్తున్నారట , వివేకానందుడికి తల్లి కంచం లోంచి తినాలనిపించిందట , తీరా చూస్తే ఆమె అప్పటికే భోజనం పూర్తి చేసిందట ఏదో ఒక ఆకు కూర కాడ ముక్క మిగిలి ఉంటే దానినే తిన్నాడట. అతనికి తల్లి పై ఉన్న మమకారం , సంసారం కోసం శ్రమిస్తూనే తనకు సన్యాసం స్వీకరించడానికి మనస్ఫూర్తిగా  అనుమతిచ్చిన తల్లి అంటే  హిమాలయమంత గౌరవం అతనికి. 
వివేకానందుడు చాలా బాగా వంట చేసేవాడట. ఈ విషయం మనకి సిస్టర్ నివేదితా ఉత్తరాలలో  లో తెలుస్తుంది నా కోసం స్వామి వంట చేసి పెట్టారని అది జన్మంతా మరవలేనిదని ఆమె కూడా రాసుకుంది. తన సహ మిత్రులైన సన్యాసులకోసం  కూడా వంట చేసేవారట స్వామి. మా బెంగాలీ వారం బహు భోజన ప్రియులమ్ అని హాస్యమాడేవారట . 
అందరికీ వండి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా ఉండాల్సి వచ్చేదట అనారోగ్యం మూలాన , అయినా అందరికీ వండి పెట్టడం లో తాను చాలా ఆనంద పడేవారట . 
అమెరికా నుండి తిరిగి వచ్చాక వివేకానందుడికి ఆరోగ్యం పాడై వొంట్లోంచి వేడి ఆవిరులు వచ్చేసేవట . మంచం మీద పడుకోలేక . నేల మీద పడుకోలేక చాలా బాధ పడేవారట . ఎప్పుడూ తాను వేగం వెళ్ళి పోతానని బేలూరు మఠం పనులు చేస్తున్నప్పుడు తన మిత్రులతో చెప్పేవారట. ఆస్త్మా   వస్తే తట్టుకునే శక్తి దైహికంగా ఉండేది కాదట. అదేమీ చిత్రమో కలకత్తా చేరుతూనే ఆస్త్మా  ఉధృతం అయ్యేదట . 
1898 లో అమెరికా యాత్రలో ఒకసారి ఆయనకి గుండె పోటు వచ్చిందని మహేంద్ర నాథ్ రాసిన వాటిలో తెలుస్తుంది. భోజనం చేసి కూర్చున్న మనిషి ఒక్క మారుగా చాలా బాధకు గురయ్యారని ఆ తర్వాత సర్దుకున్నారు అని రాస్తాడు అయన. అయినా ఆయనలోని ఆ హాస్య స్పోరకత , పట్టుదల ఏమీ తక్కువ కాలేదు. ఎన్నో యాత్రలు చేసేరు వివేకానందుడు , చివరి సారిగా తల్లిని తీసుకుని గయా యాత్ర కూడా చేశారు. కానీ అనారోగ్యం అతన్ని ఒక్క రోజు కూడా కుదురుగా ఉండనివ్వలేదు . 
విపరీతమైన తల నొప్పి ,(మైగ్రేన్)టాన్సిలిటీస్ ,డిఫ్తీరియా / ఫ్లూ /దగ్గు , ఆస్త్మా, మలేరియా , టైఫాయిడ్ ,  ఏవో రకాల విష జ్వరాలు , కాలేయ వ్యాధి అజీర్తి , గేస్ట్రో ఎంట్రీటిస్ పొట్టలో నీరు చేరడం ,డిసెంట్రీ , డయేరియా  ఆకలి లేక పోవడం పొత్తి  కడుపు నొప్పి, గాల్ బ్లాడర్ స్టొన్స్ ,లుంబాగో (నడుము చివర నొప్పి ) మెడ నొప్పి  బ్రైట్స్ డీసీస్  కిడ్నీవ్యాధులు  డ్రాప్సీ ,అల్బుమినూరియా , రక్తంచిందే కనులు  , కుడి కన్ను దృష్టిని కోల్పోవడం , నిదుర లేమి  ,తల గెడ్డం చిన్న వయసులోనే నెరిసి పోవడం , న్యూరెస్తెనియ,  భోజనం కాగానే వొళ్ళు వేడెక్కి పోవడం  వేడి తట్టుకోలేక పోవడం  ఎక్కువగా అలసట  సముద్ర ప్రయాణం లో బాధ సన్ స్ట్రోక్  డయబెటిస్  గుండె సంబంధించిన వ్యాధులు  ఇన్ని వ్యాధులతో బాధ పడేవారని వైద్యులు ఒక పట్టిక తయారు చేసేరు . 
ఎవరైనా  తనని ప్రసంగానికి పిలిస్తే దయచేసి రైలులో రెండవ తరగతి టిక్కెట్ కొనమని బతిమిలాడుకునేవారట . ఎందుకంటే ఆ రోజుల్లో థర్డ్ క్లాస్ లో బాత్రూమ్స్ ఉండేవి కావుట . 
తన ఉత్తరాల్లో ఎవరికైనా రాసేటప్పుడు ఈ విషయాలను తన ఆరోగ్యాన్ని ప్రస్తావించేవారట వివేకానందుడు. ఇన్ని వ్యాధులు బాధలు ఉన్నా  దైహికంగా,చెదరని సడలని  మనో నిబ్బరం అతన్ని ఎప్పుడూ నిర్మల హాసితునిగానే  ఉంచేవి . చిన్న చిన్న బాధలకే చతికిలబడి పోయే మనం ఇది చూసి ఎంత నేర్చుకోవాలి. ఆత్మ శక్తి ముందు ఏదీ నిలవలేదని నిరూపించిన నిరుపమాన మూర్తి వివేకానందుడు. అసలు అతన్ని సంసార బాధ్యతలుండగా నీకు సన్యాస మెందుకు  నీ కుటుంబానికి నీ అవసరం ఉంది అని చెప్పారట రామ కృష్ణుల వారు అయినా వివేకానందుడు సన్యాసం వైపే మొగ్గు చూపి స్వీకరించాడు. ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తో 21 రోజులు మంచినీరు తాగకుండా ఉన్నారట . అంతటి పట్టుదల ఆయనది. అతనికి వైద్యం చేసిన డాక్టర్ల వలన ఆయన విషయాలు కొన్ని ఆయన పోయాక గానీ తెలియలేదు. ఇంత బాధ లోనూ న్యూ యార్క్ లో ఉన్న మేరీ హేల్ అనే ఆమెకి జూన్ 23 వ తేదీన "మీ ఉత్తరం అరిగించుకోలేక పోయాను అజీర్తి బాధితుడ్ని కదా " అంటూ హస్యంగా రాశారట. నిరంతరం రాస్తూనే ఉండే ఆయనకి చివరి దశ లో పెన్ను పట్టుకోవడమే కష్టమై పోయింది. పైగా కను దృష్టి కూడా పోయింది. 
ఆ రోజు అంటే జూలై 4 ,1902  ఆ మహాభి నిష్క్రమణ దినం నాటికి ముప్పై తొమ్మిదేళ్ల , ఐదు నెలల, ఇరవై నాలుగు రోజులు అతని వయసు. ఆరోజు పొద్దుటినుండీ ఏమి జరిగిందో వివరంగా ఇచ్చారు ఈ పుస్తకం లో. దాదాపు 9 -9.30 ప్రాంతం లో రాత్రి బరువుగా ఊపిరి వస్తుంటే డాక్టర్ ని పిలుచుకొచ్చారు . ఆ రాత్రి 10.30 ఆ ప్రాంతం లో వివేకానందుడు ఈ పాంచ భౌతిక  దేహాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ వార్త అతని తల్లికి ఆమె చిన్న కొడుకు చెప్పగానే ఆమె ఎలా పోయాడు అని అడిగిందట . అచ్చం నాన్న గారి  లాగే సాయంకాలం గుండె నొప్పి వచ్చింది  వెంటనే పోయారు అని చెప్పాడట. కొడుకు దేహాన్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిని తిరిగి పంపి వేసాము కాసేపు ఉన్నాక అని సిస్టర్ నివేదితా తన జీవిత చరిత్ర లో రాసుకున్నారు. సన్యాస ఆశ్రమ ప్రకారమే అతనికి అంత్య క్రియలు చేసేరు. 
అతని సమాధి వద్ద ఒక చిన్న గుడి కూడా 1907 జనవరి వరకు నిర్మించలేదట.ఆ పని 1924 జనవరి 24 న పూర్తి చేశారట . అలాగే అతని డెత్ సెర్టిఫికేట్ కూడా ఎవ్వరూ చూడలేదట ఇప్పటివరకు  
ఇందరి హృదయాలను మన్ననలను చూరగొన్న స్వామి వివేకానందుని జీవితం అలా ముగిసి పోయింది . రామ కృష్ణ మఠం వారు కనుక  ప్రచురించక పోతే ఆయన రాసినవన్నీ పోయేవి అంటారు శంకర్. 
ఈ పుస్తకం లో మొదటి  చాప్టర్ ఏ మంక్ అండ్ హిస్ మదర్, రెండవది ,ఎంపేరర్, మంక్ , అండ్ కుక్ ఇన్ వన్ , మూడవది ద మంక్ హూ లవ్డ్ టీ, నాల్గవది , స్వామీజీస్ హెల్త్ , అయిదవది ఆఖరిది థర్టీ నైన్ ఈయర్స్ ,ఫైవ్ మంత్స్ , అండ్ ట్వెంటీ ఫోర్ డేస్ గా రాసేరు. 
ఇంతకీ ఈ విషయాలు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అని ప్రశ్నిస్తారు మీరు . ఎందుకంటే అతి పిన్న వయసులోనే ఎన్నో బాధలకు అన్నీ రకాలుగా గుయినా కూడా మొక్కవోని  సంకల్ప బలం తో బేలూరు మఠాన్ని తన చేతుల మీదుగా కట్టిన మహనీయుడు , రామకృష్ణుని ప్రియ శిష్యుడు వివేకానందుడు. అందుకే నాకనిపిస్తుంది ఎప్పుడూ గురువులను వెదుక్కుంటూ శిష్యులు వెళ్లక్కర్లేదు ఆ గురువే శిష్యుని అన్వేషిస్తూ వస్తాడు. అలా తన జీవితం లోకి వచ్చిన తనని ప్రభావితం చేసిన రామకృష్ణుని బోధలు మఠం ఏవీ వివేకానందుడు లేకుంటే ఉండేవి కావు . 
మనమందరం గుర్తు పెట్టుకునే స్వామి వివేకానందుడి ఫోటో కూడా తీసేటప్పుడు తాను అనారోగ్యంగానే  ఉన్నాడు . కాస్త ఒళ్ళు కూడా ఉబ్బరంగానే ఉంది . అతనిది అంతా తల్లి పోలిక ఆ విశాలమైన కనులు తల్లి నుండి వచ్చాయి అతనికి.  ఎందరో  రాసిన పుస్తకాలు అతనితో సాక్షాత్తూ జీవితం గడిపిన వ్యక్తుల కధనాలు అన్నీ పరశీలించి , పరిశోధించి శంకర్ ఒక మంచి పుస్తకాన్ని రాసేరు అనడం లేదు నేను. వివేకానందుడి బతుకు పుస్తకాన్ని తెరిచి మనకి అతని పట్టుదల , అప్రమేయమైన , అవ్యాజ్యమైన అతని అనురాగాన్ని మనకు అందించారు . ఇవన్నీ తెలియని ఎందరో వివేకానందుని ఎంతో ఆరోగ్య వంతుడనుకుంటారు . అయితే ఈ విషయాలు తెలుసుకున్నాక స్వామి వివేకానందుడి పట్ల మనకి మరింత ప్రేమ  పెరుగుతుంది , ఎంతటి శ్రమ కోర్చి లోకం కోసం తన జ్ఞానాన్ని పంచి ఇచ్చాడు అని ఒక భక్తి భావన కలుగుఃతుంది . దైవం మానుష రూపేణ అని ఏ దైవమో  ఇలా ఈ జన్మ  లో ఉన్న అతి కొద్ది యేళ్లలో సముద్రమంతటి జ్ఞానాన్ని మనందరికీ పంచి ఇచ్చాడు అనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ తెలియకుండానే కనులు చెమరించుతూనే ఉన్నాయి . 
ఈ పుస్తకం దొరికితే చదవగలిగితే చదవండి మిత్రులారా , నాకు ఉన్న ఈ కొద్ది పరిమితి లో నా జ్ఞాన పరిమితిలో మీతో ఈ విషయాలను పంచుకున్నాను . ఒక పాటగుర్తొస్తోంది బహుశా తాతమ్మ కల సినిమాలో భానుమతి పాటనుకుంటా ,"ఎవరనుకున్నారు ఎవరు కల గన్నారు, ఎవరెంుకు పుడతారో , ఏ పని సాధిస్తారో ?  ఏడవ కొడుకుగ గాంధీ పుడతాడనుకున్నారా పుట్టి స్వరాజ్యాన్ని తెచ్చి పెడతారనుకున్నారా ?" నిజమే కదూ స్వామి వివేకానందుని లాంటి  వారు కారణ జన్ములు.  వారు చేయాల్సిన కార్యం పూర్తవగానే వారు వెడలిపోతారు శంకరాచార్యులు , క్రీస్తు ఎవరు చూశారు నలభై. నేను నలభై చూడను అనేవారట వివేకానందుడు ఆ యనకి తెలిసి పోయిందేమో  తన ఆయు ప్రమాణము అని కూడా అనిపిస్తుంది. వివేకానందుని ప్రేక్టికల్ వేదాంత ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచమంతటికీ శిరోధార్యం కాదా ! 
జగమంత కుటుంబం కాదు జగమే కుటుంబం తనకి , సన్యాసం శూన్యం కాదు సన్యసించినా జ్ఞానామృతాన్ని మనకి పంచి ఇచ్చిన ఆ మహనీయునికి ఇదే వందనం !!!
.........................................................................జగద్ధాత్రి 

2 comments:

  1. Very touching writing about the Great swamy Vivekananda. Thank you .

    ReplyDelete
  2. Good Information of Swamy... Read about gsystime.blogspt.com for spiritual/knowledge

    ReplyDelete