Tuesday, April 23, 2013

భారతీయాంగ్ల కవయిత్రులు, రచయిత్రులు (విశాలాక్షి పత్రిక లో ప్రచురితం )


భారతీయాంగ్ల కవయిత్రులు, రచయిత్రులు (విశాలాక్షి పత్రిక లో ప్రచురితం )
                                                         

రెండు శతాబ్దాలు మన భారతాన్ని పరిపాలించిన ఆంగ్లేయుల వలన మనకు అబ్బిన భాష ఆంగ్లం. 18, 19 శతాబ్దాలలో ఎందరో ఆంగ్లాన్ని అభ్య సించి, అందులో రచనలు కూడా చేసిన వారున్నారు. భారతీయులై ఉండీ ఆంగ్లం లో సృజనాత్మక రచన  చేసేవారిని భారతీయాంగ్ల రచయితలుగా మనం పేర్కొంటాము. అందులో ఎందరో మహానుభావులు , రోమేష్ చందర్ దత్త్, మైఖేల్ మధు సూధన దత్త్ , టాగోర్ , అరబిందో లాంటి ఎందరో పురుషులైతే, కొందరు ఆణి ముత్యాలవంటి భారతీయ ఇంతులు కూడా ఆంగ్లం లో రచన చేసి పేరు ప్రతిష్టతో బాటు చరిత్ర లో చిరస్థానం పొందిన వారున్నారు. అటువంటి భారతీయాంగ్ల కవయిత్రులు నాటి నుండీ నేటివర కూ ఎందరో ఉన్నారు. ఈ " భారతీయాంగ్ల  కవయిత్రులు " (ఆంగ్లం లో కవి అన్నా కవయిత్రి అన్నా రచయిత లేదా సాహిత్య సృజన చేసే వారని అర్ధం)  , పొయెట్ అనే పదాన్ని వారు రచయితకు కూడా వాడుతారు. మన తెలుగు లో రచయిత వేరు , కవి వేరు గా మనం భావిస్తాము. ఇక్కడ మనం భారతీయాత్మను ప్రతిబింబిస్తూ , భరతీయులై ఉండీ ఆంగ్లం లో రచనలను చేసిన మహిళామణులని పరిచయం చేసుకుందాము, వారి గురించి తెలుసుకుందాము. 

భారతీయాంగ్ల కవయిత్రులలో మొట్ట మొదటి కవయిత్రి తోరు దత్త్. ఈమె బెంగాలీ భాషస్తురాలు అయినప్పటికీ , ఆంగ్లము, ఫ్రెంచ్ , సంస్కృత భాషా పండితురాలు. చరిత్రలో మొదటి స్థానం భారతీయాంగ్ల కవయిత్రిగా ఈమెకే దక్కుతుంది. 

తోరు దత్త్ జీవన విశేషాలు : 

తోరు దత్ మార్చ్ 4 1856 లో గోవిన్ చంద్ దత్త్, క్షేత్రోమణి  దత్త్ దంపతుల తృతీయ  సంతానంగా జన్మించింది. తనకన్నా రెండేళ్ళు పెద్దదైన అక్క అరు , ఐదేళ్ళు పెద్దవాడైన  అబ్జు దత్ ల ముద్దుల చిన్నారి చిట్టి చెల్లెలు తోరు . తండ్రి గొప్ప కవి , భాషా సాహితీ వేత్త, తల్లి కూడా పండితురాలు, తండ్రి సోదరులు , ఓమేష్ చందర్ , గిరీస్ చందర్, హర్ చందర్ పండితులు. వారు గోవిన్ చంద్ దత్త్ కలసి అప్పటికే " ద దత్త్ ఫామిలీ ఆల్బం " రచిస్తునారు. వారి దగ్గర  బంధువు రోమేష్ చందర్ ( రామాయణ , మహా భారతాలను ఆంగ్ల పద్యం రూపం లో రచించిన ) దత్త్ ఇంగ్లాండులో ఉన్నత పదవుల కోసం విద్య నభ్యసించేవారు. ఎటు చూసినా విద్వాంసులు  , పండిత వరేణ్యులు గల గొప్ప వంశం లో అచట పుట్టిన  చేవైన చివురు కొమ్మ తోరు దత్త్ .

నాటి ఎందరో యువతరం లాగే తల్లిదండ్రులు కూడా క్రైస్తవ మతం వైపు ఆకర్ష్ణణతో తోరు కి ఆరేళ్ల ప్రాయం లో మతం మార్చుకున్నారు. మత మార్పిడి కొంత భార్యాభర్తల నడుమ , కుటుంబం లోనూ కొంత కలకలం సృష్టించినా  తల్లి క్షేత్రోమణి త్వర లోనే  క్రైస్తవాన్ని మనస్పూర్తిగా స్వీకరించడమే కాక , "బ్లడ్ ఆఫ్ జీసస్" అనే ఆంగ్ల గ్రంథాన్ని బెంగాలీ లోకి అనువదించి తన మత విశ్వాసానికి , భాషా, పాండిత్యానికి ప్రతీకగా నిలిచింది .
తండ్రి పర్యవేక్షణలో పిల్లలు ముగ్గురు , అబ్జు, అరు , తోరు , అత్యంత శ్రద్ధాభక్తులతో విద్యను  అభ్యసించే్వారు. తోరు తొమ్మిదేళ్ళ ప్రాయం లో ఉండగా 1865 లో ఆ కుటుంబానికి ఈ చిన్నారి మనస్సుకి తగిలిన అతి పెద్ద గాయం 14 యేళ్ళ అబ్జు అకాల మరణం. అక్క  చెల్లెలు అరు , తోరు మరింత దగ్గరవడమే  కాక సాహిత్యం వైపు మనసు మళ్ళించుకుని విపరీతంగా చదవడం ఆరంభించారు. "పారడైస్ లాస్ట్" గ్రంథాన్ని పదే పదే చదువుకునేవారు వీరిరువురూ. 1869 లో ఈ కుటుంబం ఇంగ్లాండు వెళి పోయారు. అక్కడ అక్క చెల్లెళ్లి ద్దరూ ఫ్రెంచ్ మరియు ఆంగ్లం లో నిష్ణాతులయ్యారు. ఇరు భాషలలో వారికి వున్న పాండిత్య ప్రతిభ ఎంతటి దంటే వారు ఫ్రెంచ్ కావ్యాలను ఆంగ్లంలోకి  అనువాదం చేసేవారు. 
1871 లో కేంబ్రిడ్జ్ లో స్త్రీల కు లభించే ఉన్నత విద్యను అభ్యయసించారిద్దరూ . అక్కడే పరిచయమైన మంచి మిత్రురాలు మేరీ మార్టిన్ తోరుకి చిరకాలం స్నేహితంగా ఉంటూ వచ్చింది . తోరు  తన లేఖలు లో ,మేరీకే తన మనోభావాలను వ్యక్తీకరిస్తూ రాసేది. 1873 లో తిరిగి దత్త్ కుటుంబం స్వస్థలమైన కలకత్తా వచ్చేసారు. 

మరొకసారి విధి రాతకు తలవంచక తప్పలేదు  దత్త్ కుటుంబానికి జూలై 23 , 1874 క్షయ వ్యాధితో అరు ఈ లోకాన్ని విడిచి చిన్నారి చెల్లెల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. మేరీకి రాసిన లేఖలో ఈ విషయం గూర్చి రాస్తూ తోరూ అంటుంది , ఇదంతా ఆ దైవ పరీక్ష , ఆయనకు తెలుసు ఏమి చెయాలో , ఏది చేసినా అది మన మంచికొరకే, అంటూ కొండంత వి్షాదాన్ని కూడా ఆ చిన్నారి హృదయం దైవం పైన ఎనలేని విశ్వాసం తో స్వీకరిస్తుంది. 

కలకత్తా వచ్చిన పదినెలల కాలం లో నే తోరు సంస్కృత భాష ను క్షుణ్ణంగా  నేర్చుకుంది. 1875 లొ మొదటిసారిగా 165 ఫ్రెంచ్ కవితల ఆంగ్లానువాదాలను  , అందులో 8 అరు అనువదించినవి  , వీటిని " ఏ షీఫ్ గ్లీండ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ " పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు గోవిన్. తోరు తను జీవించి ఉండగా కళ్ళారా చూసుకున్న మొదటి చివరి పుస్తకం కూడా అదే.   ఆమె కవనం ఆమే మరణం తర్వాత ప్రచురించారు తండ్రి. మిగిలిన ఇద్ద రిలాగే తోరు కూడా అతి చిన్న ప్రాయం లో 21 ఏళ్లకే క్షయ వ్యాధితో ఆగస్ట్ 30, 1877 లో తన అన్న అక్కలను కలుసుకోవడానికి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. 
ముచ్చ్టటగా ముగ్గురు బిడ్దలు పైగా మువ్వురూ మేధావులు అయిన పిల్లల్ని  కోల్పోయిన గోవిన్ చంద్ దత్త్ బాధ చెప్పనలవికానిది. ఆమె మరణం  తదుపరి మేరీకి రాసిన లేఖలో ఇలా రాస్తాడు , " ఆమె చివరి  ఘడియలు చాలా ్ప్రశాంతంగా గడిచాయి , నేను , ఆమె తల్లి జీవితం లో ఎన్నటికీ మరువలేనిది , ఆమె తుది శ్వాస విడిచేటప్పటి ఆమె ముఖం లోని భావాన్ని , ఎంత అద్భుతంగా ఉందో ఆమె వదనం ఆ సమయాన ...". 
అక్క , అన్న ల సమాధి పక్కనే సి.ఎం ఎస్. సిమెట్రీ , కలకత్తాలో ఆమె పార్థివ శరీరం ఖననం చేయబడింది. 

ఫ్రెంచ్ మైదానాలలో విహరించి ఆ కవితా సుమ సుగంధాలను ఆంగ్ల భాషకి పంచిన తోరు , అతి కొద్ది కాలం లోనె అత్యంత అద్భుతంగా అభ్యసించిన సంస్కృత భాషనుండి రామాయణ , మహాభారత కథలను కూడా ఆంగ్లం లోకి అనువదించింది. రామయణం లోని సీత పాత్ర పట్ల ఆమెకి కలిగిన అభిమానం , లక్ష్మణ్ అనే కవితలో లక్ష్మణుని గూర్చి తోరు తన అవగాహన  కూడా రంగరించి  కవన రచన చేసింది. 
సంస్కృతం నుండి ఆమె చేసిన అనువాదాలను కూడా ఆమె మరణం తర్వాత ప్రచురించారు  ఆమె తండ్రి. భారత , భాగవతాలలోనూ కొన్ని పాత్రలు ఆమెకి ఎంతో ఇష్టం ఉండేవి. క్రైస్తవ మతం ఆమె హిందూ సంస్కృతికి అడ్డంకి కాలేదు. 

అతి సున్నిత మనస్కురాలు, అతి చిన్న జీవిత కాలం లోనే ఎన్నో విషాదాలను చవి చూసినా మొక్కవోని ధైర్యం తో కడదాకా రచనా వ్యాసంగాన్ని చేస్తూనే తుది శ్వాస విడిచిన భారతీయ వనితా శిరోమణి తోరు  దత్ . ఆమెను గూర్చి ప్రస్తావిస్తూ కె. ఆర్. శ్రీనివాస్ అయంగార్ తన పుస్తకం " ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ " లో ఆమె జీవితాన్ని కవిత్వాన్నీ విడదీసి చూడటం అసాధ్యమంటారు. ఆమె రచించిన ఫ్రెంచ్ నవల బియాంకా కూడా ఫ్రెంచ్ వారి మన్ననలు అందుకుంది. ఇంగ్లిష్ భాషలో కామాలు, హైఫెన్స్ (చిన్న గీత గుర్తు) ఎంతటి అర్ధాన్ని సూచిస్తాయో  వాటి ఉనికి ఆ కావ్యం మనకు అర్ధం కావడంలో ఎంత భావ సాంద్రతని ప్రతిఫలిస్తాయో అలాగే తోరు దత్ అస్తిత్వం భారతీయాంగ్ల  సాహిత్య చరిత్రలో అంతటి విలువ గలిగిన స్థానం సంతరించుకుంది అని పేర్కొంటారు అయ్యంగార్. పురాణ కథలను, విష్ణు పురాణం నుండి ,   కథలను చెప్పడం ఆమెకి ఎనో ఇష్టమైన పని గా ఉండేది . 
భారతీయ కీట్స్ అని పిలిచేవారు తోరు దత్ ను . దీనికి రెండు కారణాలు ఇరువురు అతి పిన్న వయస్సులోనే మరణించారు కానీ  చరిత్రలో నిలిచిపోయే సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. " అవర్ కాసురీనా ట్రీ " అనే కవితలో కుడా తోరు తన వ్యక్తిగత జీవన విషాదాన్ని పలికిస్తుంది. ఆ చెట్టును నేను ప్రేమించేందుకు కారణం ఆ చెట్టు నీడన తను , అక్క, అన్నయలతో కలిసి ఆడుకున్న , పాడుకున్న , తీయటి స్మృతులను అక్షరబద్ధం చేస్తుంది. 
సావిత్రి కథలో యముణ్ణి కేవలం మృత్యు దేవత గానే గాక ధర్మ దేవతగా చిత్రిస్తుంది. ఇది తోరు నిశిత దృష్టికి అభివ్యక్తికి , జ్ఞాన పరిపక్వతకి నిదర్శనం. 


తన కవితల గురించి తోరు మాటల్లోనే ఇలా :
                                                                అసంబద్దం అనిపించవచ్చు నే నుడివే గాధలు 
                                                                కవాతు చేస్తున్న కాలాలకు అవి సరిపోక పోవచ్చు 
                                                                 ఆ కథలను చెప్పిన పెదవులను ప్రేమించాను నేను 
                                                                అందుకే నా పద్యాలలో ఉండనివ్వండి వాటిని 
తోరు తల్లి వద్దనుండి విన్న పురాణ కథలను ఏంటో శ్రద్ధగా మళ్ళీ తన కవిత్వం లో చెప్పే ప్రయత్నం లో సఫలీకృతురాలు అయ్యింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె కవిత " సీత " కవితకు స్వేచ్ఛానువాదం  చూడండి. 

సీత 

చీకటైన  గదిలో ఆనందంతో ముగ్గురు పసి పిల్లలు!
కనులు విప్పార్చి చూస్తున్నదేమిటో  ?
సూర్యుని వెలుగు రేఖ కూడ చొరవని చిక్కని , దట్టమైన అడవి 
అందులో మధ్యగా ఒక స్వచ్ఛమైన ప్రదేశం  -- అక్కడ పూచేను 
పొడుగు చెట్లను అల్లుకున్న తీగెలకు అతి పెద్ద పూలు , అక్కడ 
నిశబ్దమైన నిర్మల తటాకం లో 
తెలి హంసలు  ఈదుతున్నాయి  ; " ఆగిన రొదతో ",
నెమలి పురివిప్పింది ; అక్కడ, జింక  మందల పరుగు పందెం 
అక్కడే , పొలాలలో  పసుపు పచ్చటి కంకులు  ఊగుతున్నాయి ;
అక్కడే వింతైన పూజా పీఠాల నుండి తేలికగా ఎగస్తోన్న నీలి పొగ 
ఆక్కడ వసిస్తున్నాడు పరమ శాంత  కవి- రుషి .
కానీ ఎవరీ స్నిగ్ధ స్త్రీ మూర్తి ? ఎడతెగక రోదిస్తోంది 
ఆమె కార్చే ప్రతి కన్నీటి బొట్టూ  
మూడు జతల పసి కనులనుండి జాల్వారుతున్నాయి 
ధు:ఖపు బరువుతో వంగి ఉన్నాయి చిన్నారి మూడు తలలు 
అది ఒక పాత అతి పురాతన కథ , 
సీతను తన గతం నుండి ఆవిష్కరిస్తోంది 
ఒక యవ్వనవతి ఐన తల్లి గానం .....నిట్టూర్పుతో కథ ముగిసింది 
వారి నయనాల ముందునున్న చిత్రం వెలిసింది 
కానీ అదే కథను కల గంటారు ఆ చిన్నారులు  పొ్ద్దుటివరకూ!
మళ్ళీ ఆ తల్లి దగ్గర ఆ ముగ్గురు  పిల్లలు ఎన్నడు చేరేను 
ఆహ్ మనసా! మరలా అలాంటి ఒక సాయం సమయం వచ్చేనా? 

ఆంగ్లమూలం : సీత 
కవయిత్రి : తోరు దత్ 
తెలుగు సేత ; జగద్ధాత్రి 

ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు జేమ్స్ డారమేస్టేటర్  ఆమెకి అద్దినట్లు  సరిపోయే నివాళినిచ్చారు.
" బెంగాల్ కన్న పుత్రిక , ఆరాధ్యంగా, అద్భుతమైన విద్వత్తు కానుక గలిగి, జాతి, సంప్ర దాయం లో హిందువు అయి ఉండీ, విద్య వలన ఆంగ్ల మహిళ , ఫ్రెంచ్ స్త్రీ మనస్సు కలిగి , ఆంగ్ల కవయిత్రి, ఫ్రెంచ్ రచయిత్రి, పద్దెనిమిది ఏళ్లకే భారత దేశానికి ఫ్రెంచ్ కవితా పరిమళాలను అందించిన , తనలో మూడు ఆత్మలను, మూడు సంప్రదాయాలను  విలీనం చేసుకున్న , ఆమె సాహితీ జీవిత శిఖరాలను అధిరోహించాల్సిన సమయం లో అకాల మృత్యు వాత బడటం, సాహితీ చరిత్ర లోనే అతి విచిత్రమైన పోలికే లేని ఒక విషయం" 

కవితా నిర్మాణం లో ఆమె సున్నితత్వం , ప్రతిభ రెండిటికీ ఉదాహరణగా " ద లోటస్" అనే కవిత 

కమలం 

ప్రేమ వచ్చి అడిగింది వన దేవతను 
ఏక గ్రీవంగా అందరూ అంగీకరించే ఒక పూల రాణి ని ఇమ్మని 
లిల్లీ , గులాబీ, చాలా కాలంగా ఉన్నాయిగా 
ఆ పదవికోసం పోటీపడుతూ 
ఎందఱో కవులు గానం చేసారు వాటి సౌందర్యాన్ని 
గులాబి శిఖర మందలేదు , లిల్లీ తన ధవళ వర్ణం తో కానీ 
ఐతే లిల్లీ ఏ అందమైనదా ? అంటే 
వన దేవత పుష్పవనం లో రెండు వర్గాల నడుమ ఘర్షణ రేగింది 
" ఇవ్వు నాకొక పుష్పాన్ని రోజా అంత  అందాన్ని 
లిలీ అంత ఠీవి గల దాన్ని అడిగింది ప్రేమ 
" ఐతే మరి ఏ  రంగు?" గులాబి ఎరుపు , కోరింది ప్రేమ ముందర 
పిదప ప్రార్ధించింది " కాదు , లిల్లీ తెలుపు , --- లేదా రెండూ కలిగినది 
అప్పుడు వన దేవత ప్రసాదించింది కమలాన్ని 
గులాబి ఎరుపు వర్ణం , లిలీ తెలుపు కలిగిన మహారాజ్ఞి పుష్పాన్ని. 

ఆంగ్ల మూలం : తోరు దత్ 
కవిత: ద లోటస్ 
తెలుగు సేత : జగద్ధాత్రి 

జీవించిన అతి కొద్ది కాలం లోనే అక్షరంగా మిగిలిన మన భారతీయాంగ్ల  కవయిత్రి తోరు దత్. ఎనలేని కవితా పటిమ, జ్ఞాన గరిమ ను కలిగి ఆంగ్ల  సాహిత్యం లో దీపధారి  అయి అడుగులు వేసి మరింతమంది భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా తోరు దత్ చిరస్మరణీయురాలు . 

                                                                                                                                                         జగద్ధాత్రి  

Tuesday, March 12, 2013

నూత్న సనాతనం


నూత్న  సనాతనం 

శ్మశాన విరాగ నిశీధిలో సైతం 
అప్రమేయంగా సహజాతంతో 
కదిలిన నవనాడుల ప్రకంపనం 
జవ జీవాల జీవన నాదం 


అనాదిగా వస్తున్నదే అయినా 
అందిన ప్రతి సారీ ఒక కొత్త రూపు 

ఎన్ని పదాలు , పదబంధాలు, ప్రబంధాల సారమైనా 
ప్రతి మారూ వినూత్న చలనం 

తానే నేనై , నేనే తానైన 
త్వమేవాహమా 
తానూ నేనూ లేని అద్వైతమా 

తనూ నేను ప్రేమల  విశిష్టాద్వైతమా 
సమాధానపడని మనసుకి 

శాంతించని దేహానికీ నడుమ 
ప్రతి క్షణం రగిలే వాంఛా జ్వలనమా 

తీవ్ర స్ఖలనాల పిదప 
తీయని కౌగిలిలో సేద తీరే 
మనోదేహాల ఆత్మీయ చాలనం 

కాలమున్నంత వరకూ
మనిషిని శాసించే 
విశ్వజనీన శృంగార సామ్రాజ్యం 
విజయులూ వీర మరణాలూ లేని 
సరస సంగమ సంగ్రామం 

అనూచానంగా మనోదేహాత్మలను 
రంజింప జేసే మధుర మరణమిదే 
రస సిద్ధి  పొందిన 
రసజ్ఞుల   ప్రాప్త మోక్ష ఫలం   
నిత్య నూతన సనాతనం 
నిరంతరం !!!

................................ ........................ ప్రేమతో ..జగతి 4.36pm tuesday 12th march 2013 

Sunday, March 10, 2013

సందేహం


సందేహం 

గడిచి పోతున్నాయి
నిమిషాలు గంటలూ రోజులూ 
కానీ ఎక్కడో దెబ్బ తిన్న చిన్ని పావురం లాంటి మనసు 
గాయం ఎందుకైందో కూడా గుర్తు లేని 
ఇంకా ఆ బాధతోనే ... 

దు:ఖం కూడా లయమైపోయిన నిర్లిప్తత 
కవితలల్లిన కలానికి అక్షరాలే మర్చి పోయినట్టు 
ఏదో మరుపు ,
మరిచిపోవాలని ప్రయత్నించినా 
మరవలేని తనం నుండి 
పదాలను మరిచిపోయిన తనం 

మెదడు పొరల్లో నిక్షిప్త జ్ఞానపు పూల తీగ
తెగి పడి అల్లార్చుతూ ..... 
మనసు పందిరి నిస్సహాయంగా చూస్తూ 
చేయ్యందించాలని  ప్రయత్నిస్తూ 

అన్నీ పక్కకు నెట్టి 
అసహజపు నిద్ర అరువు తెచ్చుకోవాలని 
మత్తు లో మునిగి 
మెలకువా నిద్రా కాని సందిగ్దత లో 

ఎక్కడో వాడి రాలిపోయిన కవితా కుసుమ పరిమళం 
గాలిలో తేలుతూ మెదడు మేనుని తాకుతూంటే 
నైరాశ్యపు పొరలు చీల్చుకుని 
పదాలు పరుగులిడి నా కౌగిలిలోకి ఉరుకుతోంటే 

కాదనలేని ప్రేమ పాశమే దో  సంధించి 
నను పట్టి లాగుతోన్న  వైనం 
చిత్రాతి చిత్రంగా నాకు నా మనసే 
కొత్తగా , పరిచయం లేని పాపడిలా 
నా కొంగున దోగాడుతూ ... 

మళ్ళీ నిశ్శబ్దం లోంచి శబ్దం లోకి 
మౌనం నుండి మానసాన్ని 
మళ్ళించాలని చేయాలనిపించీ 
చెయ్యలేని విశ్వ ప్రయత్నం లో 
ఓడి పోయి , నిస్సహయంగా 
జారిపోతున్న కాల సుమాలని 
నిస్తేజంగా చూస్తూ ఉండి  పోతున్నా 

ఈ నిశ్శబ్ద మౌన సమాధి నుండి 
మళ్ళీ  ఎప్పుడు మేల్కొంటా నో 
అసలంటూ మరల పూర్తి మెలకువ 
ఇక ఎన్నటికైనా వస్తుందో రాదో 
అదీ సందేహమే మరి 

...... ..... ...... ..... ...... ....... .... ప్రేమతో ..జగతి 7.52 pm sunday (shivaratri) 10th march 2013 



Friday, February 15, 2013

డైవింగ్ టేబుల్ ....



అనగనగనగా ఒక కుర్చీ 
ఒక కుర్చీ కాదు ఒకే ఒక్క కుర్చీ 

ఒకే ఒక్క టేబుల్ ముందు ఒకే ఒక్క  కుర్చీ 
అంది కదా ఓ రోజు టేబుల్ 
"ఎందుకని ఎప్పుడూ ఒకే కుర్చీ
మరెన్నిటికో కాకున్నా మరో మూడింటికి 
జాగా ఉంది కదా ? "

నవ్వింది కుర్చీ పకపకా 
" ఎందుకోయ్ ఇలా అడుగుతున్నావ్ ఇవాళా ?" అంది 
" ఎన్నాళ్ళీ ఏకాకి బతుకని ?" నీళ్ళు నమిలింది టేబుల్ 
" ఏకాకి అని ఎవరన్నారు ? ఇది నా ఇష్ట సామ్రాజ్యం 
నాకుగా నేనే నిర్మించుకున్నా , ఆనందంగా నే ఉన్నాగా?"

" ఔను గానీ నాకు తెలీకడుగుతా, ఒంటరి గా అనిపించదూ?" 
మళ్ళీ పకాలున నవ్వింది కుర్చీ 

" ఎందుకూ ఒంటరితనం? " 
అని నవ్వుతూ మళ్ళీ తనే చెప్పింది ఇలా 
" అయ్యో పిచ్చి మొద్దూ! దీన్ని ఒంటరితనం అనరు 
స్వయంగా కావాలని  ఏర్పరుచుకున్న ఆనందపు ఏకాంతం "

" ఎందుకెంచుకున్నావీ ఏకాంతాన్ని ?" ఆరాగా అడిగింది బల్ల 
" నేను నేను గా బతకాలని , నా భావాలని బతికించుకోవాలని" 
జవాబు చెప్పింది పెంకి కుర్చీ 

" ఆ పాటి జాగా కనీసం మరో కుర్చీకైనా ఇవ్వచ్చుగా ?" 
హితవు చెప్పబోయింది బల్ల 
" లేదు నా రాత బల్లకి , నా మేత బల్లకి ఉండాల్సినది 
ఒకే ఒక్క కుర్చీ అది చాలు నాకు 
అందుకే ఈ ఏకాంతంతో సావాసం ,ఎన్నెన్నో చెయ్యగలిగిన సాహసం 
అన్నిటికీ స్ఫూర్తి నాకు నేనే " గర్వంగా చెప్పింది కుర్చీ తలెగరేస్తూ .
..........................................................................................................ప్రేమతో ...జగతి 8.39 pm 15th feb 2013 

Sunday, February 10, 2013

అర్ధం చేసుకోవూ ......





ఆత్మ శోధనంటూ అతి శోధనతో 
సహజాన్ని అసహజం చేస్తూ
వాస్తవికతని  అధి వాస్తవికంగా అర్ధం చేసుకుంటావు 
సహజాతాలకి , ప్రకృతి నైజాలకి 
నీ మేధ ను జోడించి ప్రపంచం లో 
నీదే ధు:ఖం అనుకుంటావు 
అది నీ బలమో బలహీనతో 
నీకే అవగతమవ్వాలి మరి  

అక్షరాల కావిడిని  భుజం పై వేసుకుని 
ఓటి కుండలతో కావ్య జలాన్ని  మోద్దామని
ప్రయత్నిస్తూనే ఉంటావు 
ఎందుకీ ఎకాకి కంచి గరుడ సేవ చేస్తున్నావో 
నీ అంతరీక్షణకే తెలియాలి మరి 

అహాలూ అభిజాత్యాలూ ఉండకూడని చోట 
అనంతమైన కావ్య సంపదను 
ఆనందంగా పంచాల్సిన వేళ 
ఆత్మ న్యూనతలూ , ఆత్మ వంచనలూ 
చేసుకుంటూ నీలోని కవన మహరాజునీ
నీ చుట్టూ  ఉన్న శ్రవణ మిత్రులనీ నిందిస్తూ 
అర్ధం లేని ఆవేదనకి గురి అవుతావు 

ఆత్మ నిందాస్తుతి , పరనిందా స్తుతి కి నడుమ 
గబ్బిలం లా వేళ్ళాడుతూ ఆత్మ ద్రోహం 
పర ద్రోహం నీకు తెలియకనే చేస్తుంటావు 
నీ అసంతృప్తి  నీకే అర్ధం కావాలి మరి 

నిర్మలంగా నిన్ను వలచిన 
స్వేచ్ఛాక్షర కన్యను 
తూలనాడి , అర్ధం లేని న్యూనతతో 
ఆవేదనా వేడిమిని అంతరంగం లో మోస్తూ తిరుగుతావు 


స్వచ్చ్ఛంగా నీ చేతుల్లో వాలి పోయి పరవశించాలని 
ఆశతో కలలు కనే కావ్య దేవేరిని 
అపార్ధాల , అర్ధం లేని ముసుగులతో 
అవగాహనా రాహిత్యపు అహంకారంతో 
స్వయంకృతంగా దూరం చేసుకుంటూ 
మరల తనకోసమే అనునిత్యం పరితపిస్తూ పరిగెడతావు 


డొక్క శుద్ధి ఉన్న వాడివి 
ఆత్మ శుద్ధిని ఎందుకు నిలుపుకోవో మరి 


నీలో దాగున్న ఇన్ని ముఖాలను 
సమాజపు సాహిత్యపు నిలువుటద్దం లో 
చూసుకోలేక పరనిందల పరదాల మాటున దాక్కుంటావు 

ఇంతకీ ముగ్గురిలోఉన్న నీవొక్కడివా ?
ఒక్కడిలో ఉన్న ముగ్గురివా ?
బహుముఖీనమైన ప్రతిభను విస్తరింప జేయడం మాని
నీకె తెలియని నీలోని బహు ముఖాలతో 
వ్యర్ధ వేదనతో సంచరిస్తున్నావు 

ఇది సుందర సాహితీ నందనం 
సకల మానవ కళ్యాణాన్ని కోరే ఆత్మ సంకల్పం 
మనసులోని మాలిన్యాలను కడిగి 
మమతల పూలను పూయించాల్సిన కర్తవ్యం 

అంతరంగ సరంగువై 
ఆంతర్యపు అల్లకల్లోల సుడిగుండాలను ఒడుపుగా దాటి 
ఆత్మ శుద్ధితో , వస్తు వైవిధ్యం తో 
అంతులేని అనురాగం తో 
ఆత్మ యాత్ర ఇకనైనా సాగిస్తావని 
నీకోసం నీ మానవత్వపు పదఘట్టనకోసం 
నిలువెల్లా మనసు చేసుకుని 
ఎదురు చూస్తోన్న కావ్య  జగతిని 
నిరాశపరచకు ఇకనైనా ...

కవన సేద్యం తో నీ మా కలలు ఫలింపచేసి 
వసుధైక  కుటుంబకం అనే మన సంస్కృతి ఆత్మను నిలిపి 
అక్షరమై అనంతంగా నువ్వు మిగలాలని 
అందరికీ ఆదర్శం కావాలని 
ఆకాంక్షిస్తూ , అనునిత్యం ప్రార్ధిస్తూనే ఉంటాను 

ఓం శాంతి , అల్లా హో అక్బర్ , ఆమెన్!!!

................................................................ప్రేమతో ...జగతి 6.34 am 10th february 2013 Sunday